ప్రథమ దళిత కథ

*రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ ' చిరంజీవి 'కథ*
              ___కిన్నెర శ్రీదేవి

       గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది రాయలసీమలో మొట్టమొదటి దళిత కథ.అగ్రవర్ణ వ్యవసాయదారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది . 
             వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి దగ్గర అప్పుచేస్తాడు . ఆ అప్పు తీర్చడానికి ముత్తాత , తాత , తండ్రుల తరాలు గడిచి పోయాయి . వాళ్ళ తరువాత వెంకట్రాముని వంతు వచ్చింది . ఆ కుటుంబంలోని ఆడవాళ్ళు , పిల్లలు కూడా అతనితో పాటు పనిచేసినా ఆ అప్పు మాత్రం తీరదు . ఒక రోజు జబ్బుతో ఉన్న వెంకట్రాముని తల్లి పనిలోకి రాలేదని అతన్ని మాటలతోనూ , చేతలతోనూ హింసిస్తాడు రెడ్డి. తనలాంటి ఆధిపత్య కులాల దౌష్ట్యానికి ఉదాహరణగా ఈ క్రింది వాక్యాలను గమనించవచ్చు . 
" ధూ . . . యెందరికి పుట్టినావురా . . రుణపాతకం నా కొడకా . . ఈనమ్మ ముండ పనికిరాక మూడు దినాలాయ".
            భూస్వామి చేతిలో చావుదెబ్బతిన్న వెంకట్రాముడు తల్లికి సంగటి తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆమె చనిపోయి వుంటుంది . రచయిత కరుణ  రసాత్మకంగా చిత్రించిన ఈ కథ భూస్వామ్య వ్యవస్థలో భూస్వామికి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్లకు మధ్యగల ఫ్యూడల్ సంబంధాలలో ఒకలాంటి ప్రేమ ఉండేదని గ్రామీణ జీవితాన్ని వ్యవసాయదారుల ఉదాత్తతను గ్లోరిఫై చేసే వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంది.
        ____&____

*చిరంజీవి*
                __గుత్తి రామకృష్ణ 

          ఇంకా పెదింత పొద్దుంది . వెంకటరాముడు అప్పుడే పనులన్నిటిని గదుముకొని ఇంటికి వస్తూ వున్నాడు . కుర్రలు చౌకలించుతూ , రంకెలేస్తూ వస్తున్నాయి . వెంకట్రాముడు తన చిక్కాన్ని కట్టెకు తగిలించి భుజాన వ్రేలాడేసుకొని చలకోలతో మందను తోలుతూ ముందుపడి వస్తున్నాడు . ఊరి ముందుకు వచ్చిన తర్వాత సుబ్బన్న మామ యెదురై అడిగినాడు . 'యేరా ! యంగట్రాముడూ ! ఇంకా పొద్దుండగానే యింటికి తోలుతావుండావేమీ . రెడ్డి అరచడాయేమి ?' 
         వెంకట్రాముడు యేమీ బదులు చెప్పలేదు . ' ఉండు మామా ' అన్నాడు . అంతే . ఆత్రంగా ప్రక్క దోవలు పడుతూ వున్న పసరాలను వూర్లోకి మళ్లించి ముందుకు పడిపోతూ ఉన్నాడు . 
         ఊర్లోకి పసులొచ్చింది చూసి కొంతమంది పిల్లలు వెంకటరాముని వద్దకు పరుగెత్తి వచ్చినారు . ప్రతి దినము వెంకట్రాముడు చేనినుంచి వచ్చేటప్పుడు సద్దకంకులో , 
పెసరకాయలో , తెచ్చి యిచ్చే అలవాటు . ఈ దినం ఆ పొలకనేమి కనపడక పిల్లలు యెగాదిగా చూసి వెళ్లిపోయినారు . 
        కొంత దూరము పోయిన తర్వాత యెదురింటి అచ్చమ్మవ్వ యెదురై అడిగింది . ' యేరా యెంగట్రాముడూ ! నేను చెప్పిన ఆకు తెస్తివా ? " 
        ' తెస్తాలెవ్వా ' అని పరధ్యానంగా బదులు చెప్పి ముందుకు నడిచినాడు . 
          ఇంతలో నారమ్మ అత్త దగ్గుతో అగ్గి తీసుకుపోతూ వచ్చింది . ' ఏమి యంగట్రా ముడూ ! మీ యమ్మకు యెట్లుంది ' అని అడిగింది . 'అట్లే ఉందత్తా' అని బదులు చెప్పి ప్రక్కకు తిరిగి చూచినాడు . పశువులన్నీ రెడ్డి యింటి ముఖం పట్టిపోతు న్నాయి . పోతాయిలే అనుకుంటూ , తాను తన గుడిసె యింటికి పోయినాడు . 
    ‌  ‌‌     వెంకట్రాముడు తడిక తీసి గుడిసెలో ప్రవేశించాడు . తల్లి కుక్కి మంచములో పడి మూలుగుతూ ఉంది . అమ్మా . . . ఓం మ్మా ! అని పలకరించాడు . తల్లి కొంచెం కదిలి . ' యేమి నాయనా వస్తివా , నీవు వచ్చేదంకన్న వుంటానో లేదో అనుకుంటి ' అని కొడుకును దగ్గరగా 
తీసుకుంది . 
          ' నాయనా . . . యంగట్రాముడూ . . . యింక నేను బ్రతకునురా , చచ్చేదాన్ని యట్లా సస్తాను . . . . . నిన్నో . . . యింటోన్నన్నా . . చేసి చచ్చివుంటే . . . . నా ప్రాణానికి బాగుండేది . రెడ్డికి గూడ ఈ సంగతి చెప్పితి . ' నాయనా , ముసిలి ముండనయినాను . నా బొందిలో ప్రాణ ముండగానే 
నా కొడుక్కు పెండ్లి చెయ్యి . . . నా జీవితంలో ఆ సంబరమన్నాచూసి సస్తాను ' అని . . . కాని 
ఆ మారాజు చెవులోనన్నా వేసుకోలా ' .
             వెంకట్రామునికి చావంటే భయం , తన తండ్రి చచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవించినాడు . ఇప్పుడు మళ్లీ తల్లి చావును జ్ఞాపకం చేస్తూ వుంది . ఆ భయాన్నంతా దిగమింగి తల్లిని ఓదార్చుదామనుకొని నేను బాగా పెద్ద అయిన తరువాత సంపాదించి చేసుకుంటా లేమ్మా . నువ్వేమీ దిగులు పడొద్దు ' అన్నాడు . 
            దిగులెందుకు నాయనా , నాకెందుకు దిగులు , అంతా రెడ్డోరే చూసుకుంటారు . మీ నాయన పెండ్లి చేసింది . వాండ్లే కదా ? మీ తాత పెండ్లి కూడా రెడ్డోరే చేసినారట . ఇంక 
నీ పెండ్లికి మాత్రము లోటు చేస్తారా నాయనా , నువ్వు సంపాయించేదెప్పుడు ? మీకు సంపాయించే రాతే వుంటే , యిప్పటికి రెడ్డోరి బాకీ తీరేవుండును . ఎప్పుడో మీ ముత్తాత పెండ్లికి గాను మూడు యిరవైలు రెడ్డోరితో అప్పు తీసుకుండారంట . ఆ అప్పు అట్లే వస్తావుంది . వడ్డీ కట్టలేక 
తల్లులు పిల్లలు యింటి చాకిరీ చేస్తావుండాము . చాకిరీ చేస్తే వాండ్లో యింత కూడు గుడ్డా యేస్తారు . వాండ్లనే నమ్ముకుంటే నీకు పెండ్లి కూడా చేస్తారు . నా కండ్ల ముందర కాకున్నా . . . . . 
అమ్మయ్యా ! . . వెంకటేశుడా . . . నారాయణ మూర్తీ . . . యిన్ని నీళ్లు యీ నాయినా , నోరు ఆరుకొస్తావుంది ' . 
        ' గంజి తెస్తాను తాగమ్మా , పొద్దున్నుంచి కడుపులోకి యేమీ పోలేదు " 
     ' గంజి యెవరు చేసిస్తారు . నాయనా మనకు ' 
     " పోనీ సంగటే తెస్తాను నీళ్లలో పిసికితే గంజి అవుతుంది ' 
       ' పో , పోయి బిరీనరా ' 
       వెంకటరాముడు రెడ్డి యింటికి పోతూ వున్నాడు . దోవలో యెక్కడలేని ఆలోచనలు తట్టాయి. వచ్చేటప్పుడు పశువులను గాటిపాట్న కట్టేసి రాలేదు . కోడెలన్నీ పోట్లాడి యిల్లంతా గగ్గోలు పట్టించి వుంటాయి . పసిగిత్త మందలో ఉండినట్లే లేదు . కట్టి వేయనందువల్ల , ఆవులన్నీ పాలుచేపి దూడలను తాపుకొని వుంటాయి . ఈరాత్రికి పాలు లేనట్లే . ఇదంతా చూసి రెడ్డి ఉగ్రుడై ఉంటాడు . ఆలోచనలతోనే వెంకట్రాముడు రెడ్డింటి వాకిలి తొక్కినాడు . రెడ్డి గర్జనలు వినపడినాయి . ఎదుటపడినాడు . వెంటనే రెడ్డి అందుకున్నాడు 
       ' థూ . యెందరికి పుట్టింటివిరా , రుణపాతకం నాకొడుకా . . . ఈనికి పెండ్లంట . పెండ్లి.ఈ నమ్మ ముండ పనికిరాక మూడు దినాలాయ , ఈ లంజ కొడుకు . . . . '. 
          నోటి దురద తీరేదంకా రెడ్డి తిట్టినాడు . చేతిలోని బర్ర విరిగేదంకా కొట్టినాడు . వెంకట్రాముడు కిమిక్కు మనలేదు . ఒక చోట కుప్పైకూచున్నాడు . ఆవేశము తగ్గిన తర్వాత రెడ్డి 
వెళ్లిపోయాడు . 
          రెడ్డి భార్య లక్ష్మమ్మ దయగల తల్లి . వెంకటరామున్ని పిలిచింది . అతనితో సంగతంతావిని , పుటకగంప నిండా సంగటి ముద్దలు నింపింది . ఇంత ముంతకు చారుపోసి 
వెంకటరామునికి యిచ్చింది . 
          వెంకటరాముడు తీసుకొని బిరబిర యింటికి పోయినాడు . ఇంటిలో అమ్మ మూలుగు వినపడ లేదు . పలుకరించాడు . 
         “ అమ్మా ! ఓం మ్మా ! " అమ్మ పలుకలేదు . 

                      - 26 మార్చి 1941 , విజయవాణి పత్రిక 
          ‌‌                ( ఉగాది ప్రత్యేక సంచిక )
(మొదటితరం రాయలసీమ కథలులో పునర్ముద్రితం)
( సేకరణ:పిళ్లా విజయ్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి