నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి
జమ్మలమడుగు తాలూకా పెద్ద పసుపులలోవెంకట సుబ్బారెడ్డి, మల్లమ్మ దంపతులకు 1915నవంబర్ 11న జన్మించారు. వారిది పెద్ద భూస్వామ్య కుటుంబం.
వీరు1936లో గ్రాడ్యుయేషన్ ను అనంతపురంలో పూర్తి చేశాక ప్రజాసేవలో నిమగ్నమైనారు. కాంగ్రెస్ పార్టీ లో చేరి 1936 నుండి 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పాలూరులో జిల్లా కిసాన్ సభను జరిపారు.
1938 సంవత్సరం లో జమ్మలమడుగు కు సమీపంలో ఉన్న పెద్ద పసుపులు గ్రామంలోని వై. ఈశ్వరరెడ్డి, నూకల కొండయ్యలు సంగమేశ్వర రెడ్డి, మోకా వెంకట సుబ్బయ్య లో పరిచయంతో కమ్యూనిస్టులు గా మారినారు.
చెన్నూరులో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి 28-5-1941న సత్యాగ్రహం చేసినాడు. ఆయనకు 3నెలల జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా విధించింది బ్రిటీష్ ప్రభుత్వం. జైలు నుండి విడుదలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు .
1943 నాటికి ఆలంఖాన్ పల్లి, పెద్దపసుపులు గ్రామాలు కమ్యూనిస్టు పార్టీ కేంద్రాలుగా ఏర్పడ్డాయి. 1942-43లలో ఆలంఖాన్ పల్లి, రాజంపేట గ్రామాలలో రాజకీయ పాఠశాలను నిర్వహించి ఆ పార్టీ విధానాల గురించి ప్రజలలో ప్రచారం చేసినారు. 1942 చివరి కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును కడపలో ఏర్పాటుచేసి పార్టీ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు పరిచేందుకు కృషి చేశారు. కడప, రాజంపేటలలోని కార్మికవర్గాన్ని సంఘటిత పరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.జిల్లాలో పొన్నతోట వెంకటరెడ్డి, సంగమేశ్వరరెడ్డి, పంజం నరసింహారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కె.వి. నాగిరెడ్డి, వరదారెడ్డిలతో కలిసి ఈశ్వరరెడ్డి రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించారు.
ఈయన తనజీవితంమంతా హరిజనుల, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకోసం శ్రమించారు. అప్పట్లో జిల్లాలో భూస్వాములు హరిజనులపై ఎక్కడ దాడి చేసినా ఈశ్వరరెడ్డి ఆగ్రామానికి వెళ్ళి పోరాడేవాడు.
నిరాడంబరమైనది, త్యాగశీలమైనది ఆయన జీవితం. కడప లోక్సభ నియోజకవర్గం నుండి 1952లో సిపిఐ అభ్యర్థిగా, అప్పటి జాతీయ కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఉన్న పెంచికల బసిరెడ్డిపై గెలుపొందారు. అతరువాత వరుసగా 1962, 1967, 1971లలో జరిగిన ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యునిగా నాలుగు సార్లు ఎంపికై రికార్డుసృష్టించారు. ఈ కారణంగా జిల్లాలో ఇప్పటి తరానికి కూడా ఈశ్వరరెడ్డి పేరు సుపరిచయమే.
కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈశ్వరరెడ్డి కృషిని జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేరు. పార్లమెంటు డిబేట్స్ను గ్రంథస్తం చేయించి, జిల్లా గ్రంథాలయానికి సమర్పించి, భావితరాలకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కృషి చేశారు.
''కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు''. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న వ్యక్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి. ఈయన పార్టీ కే అంకితమై పెళ్లి చేసుకోలేదు.
రా.రా., గజ్జెల మల్లారెడ్డి, వైసివి రెడ్డి, సొదుం సోదరులు, రామప్పనాయుడు, కేతు విశ్వనాథరెడ్డి, శివారెడ్డి, లచ్చప్ప, ఆర్విఆర్ లాంటి అభ్యుదయ కవులతోపాటు ప్రాచీన,ప్రబంధసాహిత్యాలతో సంబంధమున్న రచయితలను కూడా ప్రోత్సహించేవారు.
ఎవరినైనా 'ఒరేయి' అని సంబోధించే పుట్టపర్తి నారాయణాచార్యులు ఈశ్వరరెడ్డిని 'అన్నా' అని పిలవడం చూస్తే, అన్న వ్యక్తిత్వం ఏంటో అర్థమౌతుంది.
1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని సీపీఐ కార్యాలయంలో తుది శ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వరరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేసింది రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.జమ్మలమడుగులోఈశ్వరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
____ పిళ్లా కుమారస్వామి,9490122229
(ఆధారం:ఆ.ప్ర. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, రాయలసీమ స్వాతంత్ర సమర చరిత్ర, ఆంధ్ర జ్యోతి, idreampost,rayalaseemainfo.com)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి