తోలుబొమ్మలాట


తోలుబొమ్మలాట(“shadow puppetry”)

      ఆప్టన్ సింక్లేర్ అన్నట్లు కళలు,సాహిత్యం ఒక ప్రచార సాధనం. అలాగే  తోలుబొమ్మలాట కూడా ఒక ప్రచార సాధనం. రాచరికపు కాలంలో చక్రవర్తులు, మత ప్రచారకులు, ధర్మప్రచారకులు బుర్రకథ, వొగ్గుకథ, తోలుబోమ్మలాట, హరికథ లాంటి వివిధ జనరంజక మార్గాలలో తమ సందేశాలను, భావాలను,ధర్మాలను ప్రచారం చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా,టి.వి., సినిమా, పత్రికలు మొదలైన వాటి ద్వారా చేస్తున్నారు.
     ఉపయోగించే బొమ్మను బట్టి, తయారు చేసే పదార్థాల్ని బట్టి బొమ్మలాటలు 
5 రకాలు. అవి 1. తాళ్ల బొమ్మలాటలు (Maricnsttes or sering Peppes). 2. తండుగు బొమ్మలాటలు (Glove Puppets). 3. ఆ బొమ్మలాటలు (Rod Peppers.) 4. తోలుబొమ్మలు (Leather Puppets) 5. ఇతరాలు (others). అట్ట బొమ్మలు, కీలుబొమ్మలు, రేకు బొమ్మలు, బుట్టబొమ్మలు అని మరలా నాలుగు  రకాలు కూడా ఉన్నాయి.
      
       ఇవి విజ్ఞాన ప్రచార సాధనంగా, వినోదాత్మకంగా ఆధునిక కాలంలో ఉపయోగపడినాయి. ఈ బొమ్మలాటల్లో ఎక్కువ ప్రజాదరణ పొందింది తోలుబొమ్మలాట. దాని తర్వాత కొయ్యబొమ్మలాట. 
        తోలుబొమ్మలాట ఒక జానపదుల కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో  ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి వుంది.
      సంగీత, నాట్య కళారూపమైన తోలుబొమ్మలాట  భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది.  నృత్య దశ నుండి మానవుడు నాటక దశలోకి మారే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపం.
  భారతదేశమంతటా బొమ్మలాటలను పలు నామాలతో పిలుస్తున్నారు. తమిళనాడులో తోలు బొమ్మలాట్టం అని, బొమ్మలాట్టం 
అని.కర్ణాటకలో గొంబె - ఆట్ట అని, తొగలుగొంబె అనీ, కేరళలో తోల్ పావకూత్తు అనీ, పావకూత్తు అనీ, ఒరిస్సాలో కాఢీ కుందేయ్ నాచా,  రావణచ్చాయ అనీ: మహారాష్ట్రలో కళాసూత్రి బాహుల్యే   అనీ; రాజస్తాన్లో కట్ పుత్లీ' అనీ, పశ్చిమబెంగాల్ లో పుతుల్ నాచ్ అనీ  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఉన్నాయి. 

తోలుబొమ్మలు - ఆవిర్భావం

తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజాస్థానాల లోని పండితులు తమ ప్రభువులను సంతోష పెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు.

తెలుగులో ఎక్కువగా తోలుబొమ్మలు, కొయ్య బొమ్మలకే ప్రాచీన ఆధారాలున్నాయి. సంప్కృత సాహిత్యంలో కథా సరిత్సాగం లోను, కథాకోశంలోను, దూతాంగదములోను, భవభూతి - మహావీర చరితము లోన, రాజశేఖరుని బాల రామయణంలోను, జయదేవుని ప్రసన్న రాఘవంలోనూ బొమ్మలాటలకు సాక్ష్యాలు కనిపిస్తాయి.



ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పాశ్చాత్యదేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తున్నది. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీ కి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు.

అశోకుని ధేలీ (ఉత్కళ(ఒరిస్సా)), గిర్నారు(మహారాష్ట్ర) శాసనాలలో ఉత్సవ సందర్భాల్లో వినోదానికి, ధర్మ ప్రచారానికి తోలు బొమ్మలాటలు విరివిగా ప్రదర్శించ బడేవనే ఆధారాలు ఉన్నాయి.

భారతీయులలో ఏ యే ప్రదేశాలలో నిది కలదో తెలియదుకాని తెలుగువారిలోను, కర్ణాటక లలోను ఇది చాలా ప్రాచీనం నుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల పెద్ద దివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు, చేతులకు, తలలకు దారములు కట్టి మధ్య నొక దబ్బతో అ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామయణకథకు గోన బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పాడుదురందురు. బొమ్మలను సూత్రములతో నాడించువా రగుటచేత అట్టి ప్రదర్శకుని "సూత్రధారుడు" అని యందురు. సంస్కృత నాటకములలో నాటకమును ప్రారంభించునప్పుడు 'సూత్రధారుడు' ప్రవేశించి ప్రదర్శింపనున్న నాటకమును గురించి కొన్ని మాటలు చెప్పిపోవును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుదివరకు సూత్రదారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే సూత్రధార పదము సరిపోవును. అట్లగుచో తోలుబొమ్మలను చూచి నాటకాలవారు సూత్రధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక నాటకాలను జూచి బొమ్మలాటగాండ్రు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంశమగును.

తోలుబొమ్మలపై వాలిసుగ్రీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, రాజులు, భటులు, మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగులతో తీర్తురు. ప్రేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు బొమ్మ అని పోల్చుకొను సాంప్రాదాయ మేర్పడినది. ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ వచ్చును. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శనము చేయుదురు. అది చాలా అసభ్యముగా నుండును. సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వము వీటిని తొలగించినదికాదు.

భారతదేశంలో బొమ్మలాటలు

బొమ్మలాటలు భారతదేశంలో, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి. ఉత్తరదేశంలో కట్‌పుతలీ అనే కొయ్యబొమ్మలాటలూ, దక్షిణదేశంలో కీలుగుఱ్ఱపు బొమ్మలాటలూ, బొమ్మలాట్టం అనబడే కొయ్య బొమ్మలాటలూ ప్రచారంలో ఉన్నాయి. ఆంధ్ర దేశంలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలావరకు మరాఠా ప్రాఁతంనుండి వలస వచ్చినవారు. వీరిని కన్నడదేశంలో కిషథషిఖ్యాత జాతివారనీ, తమిళదేశంలో కిల్లెఖ్యాత వారని, ఆంధ్రప్రదేశ్లో బొమ్మలాటవారని, తోలుబొమ్మలాటవారనీ వ్యవహరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా వందల సంవత్సరాలనుండే తోలుబొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయని నాచన సోమన తదితర కవుల రచనలనుండి గ్రహించవచ్చును.

2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, నీడల్తో ఆకృతులు వంటివి బొమ్మలాటకు దారితీశాయి. భారతీయ జానపద ప్రదర్శన కళల్లో అతి ప్రాచీనమైన దృశ్య రూపకానికి చెందినది తోలుబొమ్మలాట. క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే తెలుగు దేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

చరిత్రకారుల ప్రకారం తోలుబొమ్మలు నాగరికత అంత పురాతనమైనవి. క్రీ.పూ 2500 సం॥నకు వెనక్కి వెళ్తే, పురాతన నాగరికత అయిన హరప్పా మరియు మొహంజోదారో కొన్ని వేల కిలోమీటర్ల వరకూ వ్యాపించింది. ఒక రకమైన పురావస్తు తవ్వకాల్లో  తల భాగాన్ని ఒక తీగతో అతకించగల ఒక టెర్రకోట ఎద్దును కలిగి ఉంది. ఇది ఒక పరిమితమైన యానిమేషన్ లాంటిది . పైకి క్రిందకు జారగల ఒక టెర్రకోట కోతి బొమ్మ కూడా దొరికింది. ఇది ఒక వాహన కదలికను సూచిస్తుంది.

క్రీ.పూ 6వ శతాబ్దం నాటికే భారతదేశం లో తోలుబొమ్మల ప్రదర్శనశాల (Shadow theater) ఉండేది. అప్పటినుండే భారతదేశం లో వివిధ 
పల్లె ప్రాంతాల్లో వినోదాన్ని అందించింది. 


మహాభారతంలో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. చీరమరుగున బొమ్మలనాడించు వారు అన్న పాల్కురికి సోమన చెప్పిన పద్యంలో తోలుబొమ్మలనే ప్రస్తావించారు. భగవద్గీతలో సత్త్వ, తమో, రజో గుణాలు మూడు దారాలని, అవి పరమాత్మునిచేత మానవ జీవన గమనంలో లాగబడుతుంటాయని చెప్పబడింది. మానవుడు బొమ్మ అయితే అతనికున్న సూత్రాలు ఈ మూడు గుణాలు. ఆడించేవాడు భగవంథుదు అన్న అర్థంలో ఉన్న ఈ భాగం నిజానికి తోలుబొమ్మ లాటలకు సంబంధించిన ప్రస్తావన.

క్రీ.పూ 3 వ శతాబ్ధానికి చెందిన అశోకుని శిలా శాసనాల్లో జంబూ ద్వీపానికి బొమ్మలాట ప్రదర్శన కేంద్రంగా చెప్పినారు. పతంజలి మహాభాష్యంలో తన కాలంనాటి వినోద సాధనాలను వివరిస్తూ మూడు ప్రధానమైన వాహికలను వివరిస్తూ వాటిలో బొమ్మలాట ఒక ప్రధానమన వాహిక అని వివరించారు.

 బౌద్ధ జాతక కథలైన  తేరి గాథల్లో
బొమ్మలాటకు సంబంధించిన ప్రస్తావన ఉంది. వాత్సాయనుని కామసూత్రాల్లో బొమ్మలలోని రకాలు, బొమ్మలాటల్లోని తేడాలు చర్చింపబడినాయి. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసరమని వాత్సాయనుడు చెపుతాడు. ప్రాచీన భారతదేశంలో బొమ్మలాట ఒక పవిత్రమైన కళగా భావించబడింది. ఇది ఒకరకంగా ప్రాచీన కాలపు సినిమా. జానపదుని కళాత్మక సృష్టికి ఇది నిదర్శనం. వినోద సాధనంగానే కాకుండా ప్రభోదాత్మక సాధనంగా కూడా ఈ కళారూపాన్ని జానపదుడు మలచుకున్నాడు. తరువాతి కాలంలో వెలువడిన నాటకానికి బొమ్మలాట నాంది పలికింది. నాటకమే తరువాతి సినిమాకు మూలం. కాబట్టి పరోక్షంగా తోలుబొమ్మలాట సినిమాకు మూలమైంది.

కదలికలోని ఆనందం కనుక్కున్న మనిషి ఆలోచనలోనుండి పుట్టిందే బొమ్మలాట. స్థిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించు కున్నాడు. కథ చెప్పడం మొదలైన తరువాత ఆ కథలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటలు అనేకము ఉన్నాయి.

తోలుబొమ్మలాటలో పాత్రలు

తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హస్యపాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. తోలుబొమ్మలాటలో ప్రధానకథకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఈ హస్యపాత్రలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా అభినయాలకు స్వభావానుగుణంగా తేల్చడానికి వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతం లకు సంబంధించిన కథా వస్తువులు ఉంటాయి. లంకాదహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో తోలు బొమ్మలను ప్రదర్శిస్తారు.

సూత్రధారుడు

నాటకానికి, సినిమాకు దర్శకునిలాగా తోలుబొమ్మలాటకు సూత్రధారి ప్రధాన బాధ్యత తీసుకొంటాడు. అతను చాలా విషయాలలో ప్రజ్ఞాశాలి కూడా అయిఉంటాడు. మిగిలినవారందరూ అతనిని అనుసరిస్తూ ఉంటారు. సూత్రధారుడు కథను చాలా వివరంగానూ, చాకచక్యంగానూ చెబుతుంటాడు. అవసరమైనంత వరకు అర్థాలను విడమరచి వివరిస్తాడు. పాత్రల ఔచిత్యానుసారం గొంతు మారుస్తుంటాడు. ప్రేక్షకుల ఆదరణను, విసుగును గమనిస్తూ సమయాను కూలంగా మార్పులు చేస్తాడు, ఇతర పాత్రలను ప్రవేశపెడతాడు.

జుట్టుపోలిగాడు, బంగారక్క

ఈ రెండు పాత్రలూ తమ హాస్యం ద్వారా ఇంత పొడవాటి ప్రదర్శనలో ప్రేక్షకులను నవ్విస్తూ నిద్రమత్తు వదలగొడుతూ ఉంటాయి. మధ్యమధ్యలో వారి విసుర్లు, పనులు సమాజంలో దురంతాలను కుళ్ళగిస్తూ ఉంటాయి. ఎక్కువగా బంగారక్క గడసరి పెళ్ళాంగా ఉంటుంది. పోలిగాడితో కయ్యానికి దిగుతుంది, మోటు సరసమాడుతుంది.

అల్లాటప్పగాడు, కేతిగాడు

పోలిగాడు తెరమీదనుండి తప్పుకున్నపుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునే దానికి (లోబరుచుకునే) దానికి ప్రయత్నిస్తుంటాడు. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నపుడు హఠాత్తుగా కేతిగాడు ఊడిపడతాడు. అన్నిబొమ్మలకంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలా పుడకలా తెరపై ఎక్కడో ఒకచోట ప్రత్యక్షమై శృంగారఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒకదెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పగాడు. ఇక కేతిగాడు బంగారప్పను ఏడిపిస్తాడు.

తోలుబొమ్మలాటలకు ఉదృతంగా ఆదరణ లభిస్తున్న రోజుల్లో ఈ ప్రదర్శనను ఆ గ్రామంలోని పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు. తమకిష్టమైన పురాణ పురుషుల కథలను తెలుసు కునేందుకు ఈ తోలుబొమ్మలు తప్ప, మరోసాధనం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంకా చరిత్రను పరిశీలించి చూస్తే నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో మానవుడు తన మనుగడ కోసమే ఎక్కువ కాలాన్ని వెచ్చించిన తొలినాళ్ళలో ఈ జానపద కళారూపం అవిర్భవించడంతో అతనికి మనోరంజనం కలగడమేకాక, తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. అంతేకాక పాత్రల స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని, తన జీవన సరళిలో నీతినియమాల పాటింపుతో కొంత నాగరికతను పెంపొందించుకునేవాడు. ఒకరకంగా తాము కొలిచే దేవుడికి ఒక సమగ్రమైన రూపాన్ని తోలుబొమ్మలాటతోనే గుర్తించగలిగి, ఆరాధించడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు.

తోలుబొమ్మలాటలకు ఆరెమరాఠీవారు  
తంజావూరును పాలించిన మరాఠరాజులతో
వచ్చిన కళాకారులు అక్కడి నుండి వచ్చి దక్షిణాన స్థిరపడ్డారు.ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వీరంతా ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి బొమ్మలాట కళాకారులుగా స్థిరపడి పోయారు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో మరాఠీవారు తోలుబొమ్మలాట వారుగా స్థిరపడ్డారు. కొందరు సురభి కళాకారులుగా నాటక ప్రదర్శనలు చేసుకుంటున్నారు.

వార్తాపత్రికలు, రేడియో వంటి సమాచార వ్యవస్థలేని తొలిరోజుల్లో తోలుబొమ్మలాట సమాచార మాధ్యమంగా పనిచేసిందని చెప్పవచ్చు. గ్రామ సంచారంగా సాగే ఈ కళాప్రక్రియ ఒక గ్రామంలోని సమాచారాన్ని మరో గ్రామానికి చేరవేయడం, ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు, రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో దృశ్యరూపంగా అందించి సమాచార వారధిగా నిలిచింది. ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు చివరి దశలో ఉన్నాయి.

__ పిళ్లా కుమారస్వామి,9490122229
(Source: www. puppetindia.com, Wikipedia, నాల్గవ తెలుగు ప్రపంచ మహాసభలు ప్రత్యేక సంచిక)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

కదిరి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి