రాయలసీమ పేరు ఎలా వచ్చింది?
1928లో రాయలసీమ నామకరణం
“ దత్త మండలాలు " అన్న పేరు " రాయలసీమ " అని మారటానికి దాదాపు 128 సంవత్సరాలు పట్టింది . ప్రసిద్ధంగా ఉండేదో లేదో చెప్పటం కష్టం కానీ ఈ ప్రాంతానికి "రాయలసీమ " అన్న పేరు ఉన్నట్టు మట్టి రాజుల కాలంలో వచ్చిన
" అభిషిక్త రాఘవము " అన్న తెలుగు కావ్యంలో ఉంది . తరువాత ఆ పేరు ఎందుచేత మరుగున పడిపోయిందో తెలియదు . మట్టి రాజులు విజయనగర చక్రవర్తులలాగా
దక్షిణ భారతదేశాన్నంతా పరిపాలించిన రాజులుకారు . చాలాకాలం విజయనగర రాజులకు సామంతులుగా , తరువాత స్వతంత్ర రాజులుగా ఈనాడు రాయలసీమ
అంటున్న ప్రాంతంలో కొంత భాగాన్ని పరిపాలించిన చిన్న రాజులు మాత్రమే . మట్టి ' అనంతభూపాలుడు " రాయలసీమ " ను పరిపాలించినట్టుగా ఈ గ్రంథం చెబుతుంది .
దత్తమండలాలు అన్న పేరు రాయలసీమ వాసులకు ఏవగింపుగానే ఉంటూ వచ్చింది . 1928 నవంబరు 17,18 తేదీలలో నంద్యాలలో ఆంధ్రమహాసభ జరిగింది . రెండవ రోజు కడప కోటిరెడ్డి అధ్యక్షతన మొదటి దత్తమండల ప్రతినిధుల సమావేశం జరిగింది . అందులో దత్తమండలాలు అన్న పేరుకు ప్రత్యామ్నాయం ఏమిటన్న చర్చ వచ్చింది . చిలుకూరి
నారాయణరావు గారు “ రాయలసీమ ” అన్న పేరును సూచించారు . అది వెంటనే ఆమోదాన్ని పొందింది . “ వదరుబోతు " పత్రిక సంపాదకుడు పప్పూరి రామాచార్యులు
గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు . సభ ఏకగ్రీవంగా ఆమోదించింది . గుత్తికేశవ పిళ్ళై , కడప కోటిరెడ్డి , పప్పూరి రామాచార్యులు , కల్లూరి సుబ్బారావు , గాడిచర్ల
నాయకులూ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ , గడియారం వెంకటశేషశాస్త్రి , పుట్టపర్తి నారాయణాచార్యులు , విద్వాన్ విశ్వం , తిరుమల రామచంద్ర వంటి కవులూ విద్వాంసులు రాయలసీమ అన్న పేరుకు విస్తృతమైన ప్రచారం తెచ్చిపెట్టారు
గతంలో హిరణ్యక రాష్ట్రం , ములికినాడు , రేనాడు మొదలైన అనేక పేర్లు కలిగిన ఈ ప్రాంతం ఆధునిక చరిత్రలో "రాయలసీమ " గా స్థిరపడిపోయింది .
(రాయలసీమలో ఆధునిక సాహిత్యం_వల్లంపాటి వెంకటసుబ్బయ్య)
(సేకరణ: పిళ్లా విజయ్)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి