పూలకుంట సంజీవులు
అనంతపురం జిల్లా తొలితరం కమ్యూనిస్టు అర్గనైజర్లలో పూలకుంట సంజీవులు గారు ఒకరు ఆయనిది అరకొర ప్రాథమిక విద్యాభ్యాసం. తనకు పరిచయం అయిన సంజీవులను కమ్యూనిస్టుపార్టీ తీర్చిదిద్దింది. స్టడీసం ఘాల ద్వారా,పార్టీ, ప్రజాసంఘాలు ప్రచురించే సాహిత్యం చదివించడం,చర్చించడం ,రేకెత్తిన ప్రశ్నలకు సదాశివన్, రాజశేఖర రెడ్డి, వి.కె.ఆది నారాయణ రెడ్డి ద్వారా సమాధానపరుస్తూ ఆయనను సామాజికవిజ్ఞాన విద్యావంతునిగా తీర్చి దిద్దింది అట్లా ఏర్పడిన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో ఈయన పార్టీ నిర్వహించిన భూఆక్రమణ పోరా టాల్లో, వ్యవసాయ కూలీ పోరాటాల్లోను చురుకుగా పాల్గొన్నాడు. అంతేకాదు, ఈయన రచయితా కూడా. వ్యాసాలు రాసినా డు. పాటలు రాసి నాడు. కవిత్వం రాసినాడు. మంచిగొంతుతో పాడే గాయకుడు కూడా..మహా ప్రస్థానం చాలా భాగం కంఠతా వచ్చు.
చాటించర ఇంటింటా
--- శ్రీ పూలకుంట సంజీవులు
--- విశాలాంధ్ర 1977
మతోన్మత్త దురహంకార
నియంతృత్వ పెత్తనం
‘ఎమర్జన్సీ’ దుర్దినాలు
వారసత్వ రాజరికం
ఈ దేశం – ఈ జాతీ
ఈనాటి ప్రజాశక్తి
సహించేది లేదంటూ
చాటించర ఇంటింటా !
గాంధీజీ హంతకులూ
జాతి ఎదుట నేరస్థులు
కొడుకులతో కోట్లడబ్బు
కూడబెట్టి భ్రష్టులైన
తల్లి – దండ్రు లీనాడూ
తఖ్తు ఎక్కుదామంటూ
ఓటు అడుగ వస్తారు
వాటంగా చెపుతారు
ఆ రోజులు చెల్లవంటు
చాటించర ఇంటింటా!
వెలలేని సంపదలను
ఎన్నెన్నో సరకులనూ
శ్రమజీవులు కోట్లమంది
చెమటగార్చి సృష్టిస్తే
కడుపునిండ కూడు లేదు
కట్టుకొనుట బట్ట లేదు
ముప్పదేళ్ళ స్వరాజ్యం
మనకిచ్చిన సౌభాగ్యం
నవయుగ నిర్మాతలురా
శ్రమజీవుల భవదీయులు
వామపక్ష ప్రజాస్వామ్య
వ్యక్తులకూ, శక్తులకూ
ఓట్లు యిచ్చి గెలిపించీ
ఒక నూతన పరిపాలన
సంపదలూ, పంపిణీలు
శ్రమజీవుల సర్వులకూ
సమానంగా వుండాలనే
సౌభాగ్యం పండాలనే
రాజ్యం ఈ దేశంలో
రావాలని చాటించర!
( హైదరాబాద్ లో ఈ నెల 17 వ తేదీన జరుగు అఖిలపక్ష రాజకీయ పార్టీల ఐక్యతా సదస్సుకు అంకితం )
(తేది సరిగా తెలీదు. ఎమర్జన్సీ తరువాత 1977 మార్చి 16 నుండి 19 వరకు జరిగిన ఆరో లోకసభ ఎన్నికల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశం అని గుర్తు.)
---------------------------------------------------------------------------------------------------------------------------------
అన్నార్థులపై తుపాకీ కాల్పులు
----- శ్రీ. పూలకుంట సంజీవులు
---- విశాలాంధ్ర 03-10-1964
నట్టినడి బజార్లో
పిట్టలను కాల్చినట్లు
పోలీసులు జనాన్ని
నిట్టనిలువునే కాల్చారే!
బళ్ళారి – గుంటకల్లు
బజార్లలో రక్తపుటేరులు
మార్కాపురం వగైరా
మరెన్నోచోట్ల కాల్పులు
రాజ్యం అన్ని మూలలా
రక్తసిక్తమై పోయిందే!
ఆకలి గావడం
మానవ ప్రాకృతమనే
అన్నమడగడం
ఆపద్ధర్మ మంటేనే !
అయితే ఫలితం
తుపాకీ గుండ్లా?
అడగండి ఈ
అన్యాయాన్ని
కడగండి ఈ
అరాజకాన్ని
ఇల్లిల్లూ – ప్రతి పల్లీ
పట్నం – నగరం
ప్రాణమున్న ప్రతిమనిషీ
హృదయమున్న ప్రతి ఒక్కరు
బయటకు నడవండి!
బజార్లకు కదలండి!
అన్నార్థుల చంపిన
హంతకులను
ఉరితీయ మనండిరా!
ఊరు నాడు ఏకంగా
ఉప్పెనవలె ఉరకండి
పుడమి కదలేటట్లు
పిడుగుల వలె పడండిరా!
ఒకటా – రెండా
పూట – పూటా
వరుసగా పస్తులు
“కుయ్యో – మొర్రో
బియ్యం ఇవ్వండ్రా
కొంటామర్రా ఇవిగో డబ్బులు!”
అంటున్నారే బిచ్చగాల్లవలె
అడిగినారు మరి పక్షుల్లాగా
దయా – దాక్షిణ్యం బెరుగని
దానవులు ఆ దొంగ వర్తకులు
మానవుల కన్నీళ్ళు చూచి
మమకారం చూపుతారా?
ఆకలికీ - - అన్నానికీ
సాగే ఈ సంఘర్షణ
కళ్ళుండిన ప్రతివానికి
వళ్ళు జలదరిస్తుందే!
“ ఇదంతా అరాజకం
అలగాజన మార్భాటం !”
అంటారు మన పాలకులు
అందుకే తుపాకీ కాల్పులు
ఆకలి గావడమే
ఒక మహా నేరమా?
అన్నమడగడమే
ఒక మహా పాతకమా?
అడగండి రా ఈ
అన్యాయాన్ని
కడగండిరా ఈ
అరాజకాన్ని !
ప్రాణమున్న ప్రతి మనిషీ
హృదయమున్న ప్రతి ఒక్కరు
బయటకు రా రండీ!
బజార్లకు కదలండీ!
అన్నార్థుల చంపిన
హంతకులను
ఉరితీయ మనండి!
ఊరు --- నాడు ఏకంగా
వుప్పెన వలె పొంగండి!
పుడమి దద్దరిల్లంగా
పిడుగుల వలె పడండిరా!
-------------------------------------------------------------------------------------------------------------------------------
నేపథ్యం :
---- గుంతకల్లులో 1964 సెప్టెంబర్ 26 రాత్రి పోలీసు కాల్పులు జరిగినాయి.మీనాక్షి భవన్ దగ్గర, ధర్మవరం గేట్ దగ్గరా పోలీసు కాల్పులు జరిగినాయి. “ఈ కాల్పులు ప్రజలను చెదరగొట్టడానికి కాక చంపే ఉద్దేశ్యం తోనే జరిపి నారు”. మీనాక్షి భవన్ వద్ద ఒకరు చనిపోయారు. ధర్మవరం గేటు దగ్గర ఇద్దరు చనిపోయారు. అందులో 14ఏండ్ల బాలుడున్నాడు.గాయాలు తగిలిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
అనంతపురం జిల్లాలో 1964 లో పెద్ద కరువు వచ్చింది. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. ఆ హెచ్చురేట్లకు కూడా సరుకులు మార్కెట్లో దొరకడం లేదు. ఆహార వస్తువులను ముఖ్యంగా బియ్యాన్ని దాచి వేస్తే ధర పెరుగుతుం దన్న వాణి జ్య రహస్యాన్ని టోకు వ్యాపా రస్థులు అమలుజరుపుతున్నారు. ‘అవి బాగలేవు, ఇవి బాగలేవు అని విమర్సించకుండా ఇప్పుడైనా ధర పెట్టి బంగారు తీగలు కొనుక్క తినరాడా?” అని ముఖ్యమంత్రి సలహా యిచ్చినారు“ అన్నం లేకపోతే పరమాన్నం తినొచ్చు కదా” అన్నట్లుంది అని ప్రభుత్వ బాధ్యతా రాహిత్యా న్ని, నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది కమ్యూనిస్టుపార్టీ. కమ్యూనిస్టు శాసన సభ్యులు శ్రీ.వి.కె.ఆదినా రాయణ రెడ్డి గారు, కమ్యూనిస్టుశాసన మండలి సభ్యులు శ్రీ ఐదుకల్లు సదాశివన్ గారు, గుత్తి తాలూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ.బి.టి.పక్కీరప్పగారు గుంతకల్లు పర్యటించి ఒక ప్రకటన చేశారు ---“ బియ్యం లేకపోవడం, హెచ్చు ధరలు బియ్యం కొట్లు మూసివేయడం, ఆహార విషయంలో అధికార్లు చూపుతున్న అమానుష బాధ్యతా రాహిత్యం, బళ్ళారి ఘటనలు ,వీనితో ప్రజలు తెగింపు దశకు వచ్చారు. పట్టణములోని కొందరు ప్రముఖ వ్యక్తులే ఈ తప్పుడు పంథాకు ప్రజల్ని ప్రోత్సహించారనే వదంతులు గట్టిగా వున్నా యి. ఈ కల్లోలానికి మూలకారణం విచారించకుండా పోలీసులు చనిపోయినవారి, గాయపడినవారి బంధువులను, వారి కోసం పోలీసుస్టేషనుకెల్లిన వారిని అరెస్టు చేస్తున్నారు.” అంతకు ఒక టి రెండు రోజులముందు బళ్లారిలో ప్రజలు అంగళ్ళను దోచుకున్నారు. బళ్ళారి ఘటనల ప్రేరణ తో గుంతకల్లులో అట్లాంటి ప్రయత్నాలు ఒకటి,రెండు చోట్ల ప్రయత్నాలు జరిగినాయి కాని నష్టం జరగలేదు.దొంగనిల్వలు చేసి బ్లాక్ మార్కెట్టులో అదిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్థులు నేరస్థులుగా పోలీసులు భావించలేదు.ధర యిస్తాము సరుకులు యివ్వండి అన్న సామాన్య కొనుగోలుదారులు, అట్లా అమ్మకపోతే దుకాణం మీద ఎగబదినవారు పోలీసులకు నేరస్థులు. ‘నేరస్థులు’ కనుకనే పోలీసులు చంపినారు. ఆ తరువాత కూడా రాయదుర్గంలో కాల్పులు జరిగినాయి. ప్రాణ నష్టం జరుగలేదు. చంద్రకాంతనాయుడు గారిని జైల్లో పెట్టినారు.----
(విద్వాన్ దస్తగిరి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి