రాయలసీమ లో నూతన శిలాయుగం
పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.
http://dsal.uchicago.edu/reference/gaz_atlas_1909/fullscreen.html?object=33%22 కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.
కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.
అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది. శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.
కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.
కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. "పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు'' అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి